సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెరిపివ్వని వానలతో తడిసిముద్దయిన నగరం.. ఆదివారం గెరువిచ్చిన వానతో తేరుకున్నది. దాదాపు వారం రోజుల తరువాత మధ్యాహ్నం సూర్యుడు దర్శనమివ్వడంతో నగరవాసులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు, గాలిలో తేమ 68 శాతంగా నమోదైంది. కాగా ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే జంట జలాశయాల్లోకి వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది.