మేడ్చల్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రఘునాథ స్వామి సూచించారు. ఇప్పటికే వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.
కరోనా లక్షణలు ఏవైనా ఉంటే వెంటనే సమీప ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. మహమ్మారి కట్టడికి ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పారు. మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిలో 50 పడకలు, ఘట్కేసర్ సీహెచ్సీలో 10 పడకలు, మేడ్చల్ పీహెచ్సీ ఆవరణలో 10 పడకలలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసామన్నారు. 37 అంబులెన్స్లు, 17 టెలిమెడిసిన్ సౌకర్యాలు కల్పించమని, అంబులెన్స్ కాల్ సెంటర్లు 282 ఉన్నట్లు వెల్లడించారు.