హైదరాబాద్ : లాక్డౌన్ సడలింపు వేళలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పౌరులను కోరారు. ఇతర సీనియర్ పోలీసు అధికారులతో కలిసి సీపీ మంగళవారం ఉదయం దిల్సుఖ్నగర్ నుండి ఎల్బీనగర్ వరకు రూట్ మార్చ్ నిర్వహించారు. స్పెషల్ పోలీసు, మౌంటెండ్ పోలీసు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఫ్రూట్ మార్కెట్, రైతు బజార్ తదితర ఏరియాల మీదుగా రూట్ మార్చ్ చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. మాస్కులు ధరించకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా, సామూహికంగా సమావేశమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అటువంటి వ్యక్తులపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 12,394 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మొత్తం 46 చెక్పోస్టుల్లో మూడు షిఫ్టుల్లో 3 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.