హైదరాబాద్: నగరంలోని నాగోల్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీకి ప్లాన్ చేసిన వ్యక్తిని గజ్వేల్కు చెందిన మహేంద్రగా గుర్తించారు. బంగారం షాపులో దోపిడీకి చేసేందుకు నెల రోజుల కిందటే రెక్కీ నిర్వహించాడు. రాజస్థాన్కు చెందిన ఇద్దరితో కలిసి ఈ దోపిడీ చేశాడు. ఘటన తర్వాత మహేంద్ర నేరుగా గజ్వేల్లోని తన ఇంటికి వెళ్లి బంగారాన్ని దాచాడు. అందులో కొంత బంగారం, డబ్బుతో కారులో వరంగల్కు పారిపోయాడు. అక్కడున్న ఓ స్నేహితుడి వద్ద ఆశ్రయం తీసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు దర్యాప్తులో భాగంగా మహేంద్ర భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో గజ్వేల్లోని మహేంద్ర నివాసంలో కిలోన్నరకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేంద్రకు సహకరించిన భార్య, కారు ఇచ్చిన స్నేహితుడిని, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహేంద్ర, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.