సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గంజాయి బ్యాచ్లపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల జవహర్నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంబేద్కర్నగర్లో గంజాయి వాడేవాళ్ల సంఖ్య పెరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎస్ఓటీ, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరితో పాటు మరో 10 మంది వినియోగదారులను కూడా అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. జవహర్నగర్కు చెందిన ఒంటేదు వెంకటేశ్పై గతంలో 20 దొంగతనాలు, డ్రగ్స్ కేసులున్నాయి. కీసర, బండ్లగూడలోని షాడో ఫ్యాక్స్ కంపెనీ ఉద్యోగి కవేటి సాయితేజతో కలిసి గంజాయి విక్రయిస్తుంటాడు.
జవహర్నగర్కు చెందిన ఉదయ్, లడ్డు నుంచి వెంకటేశ్ డ్రగ్స్ను సేకరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారంతో శనివారం సాయంత్రం విక్రయదారులు వెంకటేశ్, సాయితేజతో పాటు గంజాయిని వినియోగిస్తున్న జవహర్నగర్, అంబేద్కర్నగర్, బీజేఆర్ నగర్, సాయిబాబానగర్, మల్కాజిగిరి, ఆనంద్బాగ్కు చెందిన మేకల తరుణ్సాయి, మీసాల బాలనర్సింహా, నీతిపోడి గణేశ్, ఇరుగు శివకుమార్, కొడ శివకుమార్, కోలపాక కౌశిక్, జీడిపల్లి వినయ్రెడ్డి, పెడిశెట్టి రామ్ బాల్రాజ్, కౌశంత్ సింగ్, అమన్ వర్మను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 1.05 కిలోల గంజాయి, 10 మొబైల్ ఫోన్లు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ అదనపు సీపీ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్ఓటీ సిబ్బంది పనితీరును సీపీ అభినందించారు.