సిటీబ్యూరో/మన్సూరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠాల సహాయంతో అమలు చేశాడు. ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కీలక ఆధారాన్ని గుర్తించారు. రంగంలోకి దిగిన 15 పోలీసు బృందాలు ఆరు రోజుల పాటు కృషిచేసి 10 మంది సభ్యులున్న ఈ ముఠాలో నుంచి ఆరుగురిని అరెస్ట్ చేశారు. దోపిడీకి గురైన 2.7 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వివరించారు.
సికింద్రాబాద్ పాట్ మార్కెట్ నుంచి..
డిసెంబర్ 1వ తేదీ.. మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంగారం వ్యాపారులతో రద్దీగా ఉంది. బంగారం వ్యాపారి అయిన రాజ్కుమార్ సురానా ప్రతి గురువారం బంగారు ఆభరణాలను తీసుకొని.. వివిధ నగల దుకాణాలకు విక్రయిస్తుంటాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలతో తన దుకాణంలో పనిచేసే సుఖ్రామ్ను తీసుకొని బయలు దేరాడు. అప్పటికే మాటువేసి ఉన్న దోపిడీ దొంగలు ఈ వ్యాపారులను అనుసరిస్తూ వచ్చారు. వ్యాపారులు రాత్రి 8 గంటల ప్రాంతంలో కొత్తపేట స్నేహపురికాలనీలో ఉన్న మహదేవ్ నగల దుకాణానికి చేరుకున్నారు. దోపిడీ దొంగలు సుమారు ఎనిమిది గంటల పాటు వెంబడిస్తూ వచ్చారు.
కాల్పులు జరిపి.. దోపిడీ
బంగారు ఆభరణాలతో రాజ్కుమార్, సుఖ్రామ్ కలిసి మహదేవ్ నగల దుకాణంలోకి వెళ్లారు. యజమాని కళ్యాణ్చౌదరితో మాట్లాడి, ఆభరణాలు చూపిస్తుండగా.. అప్పటికే వీళ్లను వెంబడిస్తూ వచ్చిన దోపిడీ దొంగలు సుమిత్ డ్యాగర్, మనీశ్ దుకాణంలోకి వెళ్లగా, బయట ఉన్న మాన్య దుకాణం షట్టర్ మూసేశాడు. సమీపంలో హోండాయాక్టివాపై బన్సీరామ్ ఎదురు చూస్తున్నాడు. లోపలికి వెళ్లిన దోపిడీ దొంగలు.. బంగారాన్ని తమకు ఇవ్వాలని యజమానిపై ఒత్తిడి చేశారు. అడ్డుకోగా.. సుమిత్ డ్యాగర్ తన వద్ద ఉన్న పిస్టల్తో కాల్పులు జరిపి, బంగారంతో పారిపోయారు.
ఉప్పల్లో బంగారం అందజేత
దొంగిలించిన బంగారంతో హోండా యాక్టివాపై సుమిత్, బన్సీరామ్ ఉప్పల్ వైపు వెళ్లిపోయారు. అప్పటికే ఉప్పల్లో ప్రధాన సూత్రధారి మహేందర్ వీళ్ల కోసం ఒక రెస్టారెంట్లో ఎదురు చూస్తున్నాడు. యాక్టివాపై అక్కడికి చేరుకోగానే మహేందర్ తన ఎక్స్యువీ కార్లో ఫిరోజ్, డ్యాగర్తో కలిసి బంగారం తీసుకొని పాలకుర్తి వెళ్లిపోయారు. మరో ఇద్దరు దోపిడీ దొంగలు మరో రూట్లో వెళ్లారు. బంగారాన్ని, మరణాయుధాలను కొండపాకలో దాచి పెట్టారు. ప్రధాన నిందితులైన మహేందర్, సుమిత్ డ్యాగర్, మనీశ్, మాన్య కలిసి ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఈ నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మిగతా ఆరుగురిని అరెస్టు చేశారు.
గజ్వేల్ కేంద్రంగా ప్లాన్..
ప్రధాన నిందితుడైన మహేందర్ స్వస్థలం రాజస్థాన్లోని పాలి జిల్లా. జీవనోపాధి కోసం రాష్ర్టానికి వచ్చిన అతడు గజ్వేల్లో జయలక్ష్మి జ్యువెలర్స్ పేరుతో బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచనతో బంగారం వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పథకం వేశాడు. ఈ విషయాన్ని తన భార్య గుడియ, బావమరిది సుమర్ చౌదరి, రామాయంపేటలోని జయ్ భవానీ కలెక్షన్ రెడీమెడ్ దుకాణాన్ని నిర్వహించే బన్సీరామ్ , కొండపాకలో జ్యువెలరీ షాప్ అండ్ పాన్ బ్రోకరింగ్ నిర్వహించే మనీశ్ వైష్ణవ్, పాలకుర్తిలోని ఓ టెంట్హౌస్లో పనిచేసే రితేశ్ వైష్ణవ్, స్థానికుడైన మహ్మద్ ఫిరోజ్కు చెప్పాడు. అందరు కలిసి అక్టోబర్ నెలలోనే దోపిడీకి ప్లాన్ చేశారు. ఈ దోపిడీ ప్లాన్ను అమలు చేసేందుకు హర్యానా, రాజస్థాన్ నుంచి అక్టోబర్ 26న సుమిత్ డ్యాగర్, మనీశ్, మాన్యను గజ్వేల్కు రప్పించారు. అక్టోబర్ 26న ఈ ముగ్గురు దొంగలు హోండా యాక్టివాపై వెళ్తున్న ఓ వ్యక్తిని మారణాయుధాలతో బెదిరించి హెల్మెట్తో పాటు యాక్టివాను అపహరించారు. ఈ ఘటనపై గౌరారం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దొంగిలించిన యాక్టివాను ట్రావెల్ బస్లో రాజస్థాన్కు తరలించి, ముగ్గురూ హర్యానాకు వెళ్లారు.
పట్టించిన సీసీ కెమెరాలు..
విషయం తెలియగానే రాచకొండ పోలీసుల అప్రమత్తమై.. 15 బృందాలను రంగంలోకి దింపారు. బాధితులైన రాజ్కుమార్ సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన రూట్ను, వారిని వెంబడించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి, గూగుల్ మ్యాపింగ్ చేశారు. ఈ క్రమంలోనే నేరస్తుడైన బన్సీరామ్ ఉపయోగించిన హోండాయాక్టివాకు ఉన్న సగం నంబర్ను గుర్తించి, దానిని విశ్లేషించి పూర్తి నంబర్ను తెలుసుకున్నారు. ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరించారు. నిందితులు దొంగిలించిన రూ. 1.36 కోట్ల విలువైన పూర్తి బంగారాన్ని, పిస్టల్, ఎయిర్ పిస్టల్, డాగర్స్, వాహనాలతో పాటు రూ. 65,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తదితర అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారని సీపీ అభినందించారు. ఈ సమావేశంలో డీసీపీలు సన్ప్రీత్సింగ్, శ్రీబాల, మురళీధర్, అదనపు డీసీపీ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు సైదులు, మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.