సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): ప్లాస్మా కావాలన్నా.. ఇవ్వాలన్నా.. https://donateplasma.rksc.inలో రిజిస్టర్ చేసుకోండి.. ఇలా చేయడం వల్ల ప్లాస్మా అవసరం ఉన్నవారికి ఎంతో మే లు జరుగుతుందని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్లాస్మాదానంపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్తోపాటు అవగాహన వీడియోను సీపీ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ను సైతం విడుదల చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, రాచకొండ కొవిడ్ కంట్రోల్ నంబర్ 9490617234కు చాలా మంది నుంచి ప్లాస్మా దాతలు కావాలని విజ్ఞప్తులు వస్తున్నా.. అందుకు అనుగుణంగా ప్లాస్మా దాత లు ముందుకు రావడం లేదన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. ఎవరూ కూడా అపోహలు, అనుమానాలకు గురికాకుండా ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 77మంది పోలీసులు ప్లాస్మాదానం చేశారని, తాను కూడా ప్లాస్మాదానం చేస్తానని సీపీ తెలిపారు. ఒకరి ప్లాస్మాదానం వల్ల మరో ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చని.. కరోనాను జయించిన 14 రోజులు తర్వాత ప్లాస్మా ఇవ్వవచ్చని తెలిపారు. ప్లాస్మా ఇచ్చిన తర్వాత తిరిగి శరీరంలోకి 24 నుంచి 72 గంటల్లో యాంటీబాడీలు చేరుతాయి కాబట్టి.. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ప్లాస్మాదానంపై వీడియో రూపొందించిన ప్రతినిధులను సీపీ అభినందించి వారికి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత, అడ్మిన్ డీసీపీ శ్రీవల్లి, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.