హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ కేసులో మీడియా సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కేసు దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి కార్లు, తుపాకులు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. 8 ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఎల్బీనగర్కు చెందిన శ్రీనివాస్రెడ్డి, అంబర్పేట్కు చెందిన రాఘవేంద్రరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మూడు నెలల కిందట వీరు కర్ణంగూడ గ్రామంలో ఎనిమిది ఎకరాల భూమిని తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రోజూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం కూడా ఉదయం 6 గంటలకే వారు అక్కడికి వెళ్లి తిరిగి 8.30 గంటలకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో కారు నడుపుతున్న రాఘవేంద్రరెడ్డి ఛాతీలో బుల్లెట్ దిగి, వెంటనే స్పృహ కోల్పోయాడు.
పక్కనే ఉన్న శ్రీనివాస్రెడ్డి కారు దిగి పొదల్లోకి పారిపోతుండగా.. దుండగులు అడ్డగించి అతి సమీపం నుంచి కంట్లో కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను దవాఖానకు తరలించారు. వీరు అభివృద్ధి చేస్తున్న స్థలం పక్కనే కర్మన్ఘాట్కు చెందిన మట్టారెడ్డి స్థలం ఉన్నది. కాల్పుల ఘటనకు ముందు వారు మట్టారెడ్డితో మాట్లాడి బయలుదేరినట్టు తెలిసింది. పోలీసులు మట్టారెడ్డిని, హఫీజ్, కృష్ణ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హఫీజ్ శ్రీనివాస్రెడ్డి అనుచరుడు కాగా, కృష్ణ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతులకు ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.