సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 36 కోట్ల సొత్తు పట్టుబడిందని కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికలకు సంబంధించిన బందోబస్తును వివరించారు. కమిషనరేట్ పరిధిలోని 13 నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 3,326 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. 8 నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలు (ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు) రాచకొండ పరిధిలోకి వస్తాయని, అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలకు సంబంధించిన అనుమతుల కోసం ఎన్నికల రిట్నరింగ్ అధికారి (ఆర్ఓ)కి 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏసీపీ స్థాయిలోని నోడల్ అధికారి పరిశీలన తరువాత అనుమతులు జారీ చేస్తారన్నారు. ఇందుకు సీ విజిల్ యాప్ను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. కమిషనరేట్ పరిధిలో 19 చెక్ పోస్టులు, 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 ఫ్లైయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ. 36 కోట్ల విలువైన సొత్తు పట్టుబడినట్టు తెలిపారు.