MRI Scan | బన్సీలాల్పేట్, ఏప్రిల్ 3 : ఉస్మానియా నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుండటంతో గాంధీలో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం క్యూ కడుతున్నారు. ఓపీ రోగుల భవనంలో రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఉన్న స్కానింగ్ కేంద్రంలో ఒకే యంత్రం అందుబాటులో ఉన్నది. దీంతో స్కానింగ్ కోసం రోగులు వారం రోజుల పాటు వేచి చూడాల్సి వస్తున్నది. ఉస్మానియాలో మరో రెండు నెలల తరువాతే కొత్తగా ఎంఆర్ఐ యంత్రాన్ని అమర్చిన అనంతరం అందుబాటులోకి రానున్నది. గాంధీ దవాఖానలోని ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ప్రతి రోజు ఉదయం 8.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు పని చేస్తుంది. ఒక్కో రోగికి స్కానింగ్ చేయడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. అయినా రోజుకు 30 మందికి ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తున్నారు. గాంధీ దవాఖానలో ప్రతి నెల 12 వేల ఎక్స్రేలు, 10వేల అల్ట్రా సౌండ్ స్కానింగ్లు, 3వేల సీటీ స్కాన్లు, 7 వందల ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మరో కొత్త ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని సమకూర్చి.. ఎక్కువ మందికి సేవలందించాలని రోగులు కోరుతున్నారు.
అత్యాధునిక వసతులు సమకూర్చిన కేసీఆర్ సర్కార్
కేసీఆర్ నాయకత్వంలోని గత సర్కారు గాంధీ దవాఖానకు రూ.16 కోట్లతో అత్యాధునిక యంత్రాన్ని సమకూర్చింది. ఉస్మానియా దవాఖానకు కూడా గత ప్రభుత్వమే కొత్త ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం కొనుగోలుకు నిధులు మంజూరు చేసింది. విదేశాల నుంచి తీసుకురావడం, మాగ్నెటిక్ రేడియేషన్ కలిగిన ప్రత్యేక స్కానింగ్ గది రూపొందించడానికి 3 నెలల సమయం పడుతుంది. ఆ లెక్కన ఉస్మానియాలో మరో రెండు నెలల తరువాతే ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం అందుబాటులోకి రానున్నది.
అత్యవసర కేసులకు తొలి ప్రాధాన్యం..
గత రెండు నెలలుగా ఉస్మానియా దవాఖాన నుంచి కూడా రోగులు వస్తుండటంతో గాంధీ దవాఖానలో ఎంఆర్ఐ స్కానింగ్కు రద్దీ పెరిగింది. అంతకు ముందు వెయిటింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు రోజుకు 30 మందికి స్కానింగ్ చేస్తున్నాం. అత్యవసరమైన కేసులకే తొలిప్రాధాన్యత ఇస్తున్నాం. అదీకాక ఎంఆర్ఐ స్కానింగ్కు చికిత్సకు ఎలాంటి సంబంధం లేదు. ముందుగా కేవలం 5నుంచి 10 నిమిషాల్లో జరిగే సీటీ స్కాన్ రిపోర్ట్ రాగానే రోగి పరిస్థితిని తెలుసుకుని వైద్యులు చికిత్స మొదలుపెడతారు.
– డాక్టర్ ఎం.రాజారావు, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్