మాదాపూర్ : సామాన్య, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారికి కార్పోరేట్ వైద్యాన్ని అందించాలనే ఉద్ధేశ్యంతో హై లైఫ్ పేరిట దవాఖానాను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు.
మియాపూర్లోని మాతృశ్రీనగర్ కాలనీలో గురువారం అత్యాధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన 150 పడకల హై లైఫ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండి రమేష్, కార్పొరేటర్లు వి. జగదీశ్వర్గౌడ్, పూజిత గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో పాటు నార్నె శ్రీనివాస్, హై లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ శివమోహన్రెడ్డి, మేనేజ్ మెంట్ పార్టనర్ ధర్మారావు, డైరెక్టర్స్ వాణిరెడ్డి, దివ్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పోరేట్ వైద్యాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ఆధునిక వసతులు, నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలు, అనుభజ్ఞులైన వైద్య బృందంచే నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని కోరారు.
సామాన్య, మధ్య తరగతి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కార్పోరేట్ వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సకల హంగులతో ఈ దవాఖానాను ఏర్పాటు చేసినట్లు హస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ శివమోహన్రెడ్డి అన్నారు. హస్పిటల్లో అన్ని రకాల ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్స్, పరిక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కోమండ్ల శ్రీనివాసరెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నల్లా సంజీవరెడ్డి, హేమంత్ గౌడ్, గోలి శ్రీనివాస్ నాయుడు, బ్రిక్ శ్రీను, అనీల్ సాంబశివరావు, కిరణ్ యాదవ్, మూర్తి, గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.