సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): దూర విద్యా విధానం ద్వారా నాణ్యమైన విద్యా విధానం అందించడం చాలా అవసరమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సీతారామారావు అన్నారు. ఓపెన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆధ్వర్యంలో ‘అవుట్ కం బేస్డ్ ఎడ్యుకేషన్’ (ఫలితాల ఆధార విద్య) అనే అంశంపై ప్రారంభించిన మూడు రోజుల సదస్సులో వీసీ సోమవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక విశ్వ విద్యాలయం నాణ్యమైన పాఠ్యాంశాల డిమాండ్కు కట్టుబడి ఉందన్నారు. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీయల్) ద్వారా నాణ్యత పెరుగుతుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, అధ్యాపకులు నూతన అధ్యయన పద్ధతులు ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏవీఎన్ రెడ్డి, ఇగ్నోకు చెందిన స్టాఫ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొ. సంతోష్ పాండా, వర్సిటీకి చెందిన ఇన్ ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.