కందుకూరు(హైదరాబాద్) : ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో చిన్నాభిన్నమైన విద్యారంగాన్ని సీఎం కేసీఆర్(CM KCR) విప్లవాత్మకమైన నిర్ణయంతో బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) అన్నారు. కందుకూరు మండలం నేదునూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల , ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో అమెజాన్(Amazon) సంస్థ వారి సహకారంతో ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు(Poor Students) నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 298 గురుకులాలు ఉండగా, వాటి సంఖ్య 1030కి పెంచారని తెలిపారు. మన ఊరు, మన బడి స్ఫూర్తితో పాఠశాల అభివృద్ధికి అమెజాన్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
12 రకాల సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దిన వెయ్యి పాఠశాలల లాగే నేదునూరు పాఠశాలకు సకల హంగులు వచ్చాయని పేర్కొన్నారు. ఆడపిల్లలు చదువులను మధ్యలోనే నిలిపివేయవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండు జతల బట్టలు,పుస్తకాలు,రాగి జావ, ఉపాధ్యాయులకు ట్యాబ్లు ఇస్తున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ కాసుల రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.