పోచారం, జూన్ 11: అనురాగ్ యూనివర్సిటీ నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో పాటు ఉద్యోగాల కల్పనలో అగ్రస్థానంలో నిలుస్తున్నదని వర్సిటీ చైర్మన్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీలో నిర్వహించిన ఎంబీఏ, బీఎఫ్ఎస్ఐ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్సిటీ 24 ఏళ్ల విద్యా ప్రస్థానంలో అంచలంచలుగా ఎదుగుతూ వస్తుందని పేర్కొన్నారు. 2002లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభం అయిన అనురాగ్ విద్యా సంస్థ.. ప్రస్తుతం 16వేల మందికి విద్యను అందించే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు, నాణ్యమైన అధ్యాపక బృందం, ఉత్తమ అభ్యసన వాతావరణం అనే 3 అంశాలపై దుష్టి పెట్టడమే ఈ అభివృద్ధికి కారణమని అన్నారు. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ వీ విష్ణు వందన మాట్లాడుతూ.. పరిశ్రమలతో విశ్వవిద్యాలయానికి ఉన్న బలమైన అనుబంధానికి ఈ ఒప్పందం నిదర్శనమని అన్నారు. డీన్ డాక్టర్ ఉట్ల బాలాజీ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం ప్రభావంతో బ్యాంకింగ్, ఆర్ధిక సేవలు, బీమా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.
వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ అర్చనా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల విద్య, అవసరాలు కూడా మారుతాయని తెలిపారు. కేపీఎంజీ నేషనల్ లీడర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ నారాయణ స్వామి మాట్లాడుతూ.. విద్యార్థుల సమర్ధవంతమైన అభ్యాసం కోసం కంటెంట్, కాంటెక్స్, కమ్యూనికేషన్ అనే మూడు అంశాలు అవసరమని వివరించారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ కన్సల్టింగ్ సంస్థ కేజీఎంజీతో భాగస్వామ్యం కుదుర్చుకొని ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అనురాగ్ పల్లా, సీఈఓ నీలిమ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లేశం,విద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, కేపీఎంజీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.