మేడ్చల్/శామీర్పేట /జవహర్నగర్, జూలై 11: ప్రజల శ్రేయస్సు, వారి సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఆ దిశగా పని చేస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కేవలం సీఎం కేసీఆర్కే సాధ్యమన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ, శామీర్పేట, జవహర్నగర్లో మంత్రి మంగళవారం పర్యటించారు. మేడ్చల్లోని వివిధ వార్డులో రూ.2.13 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు.
మూడు చింతలపల్లి మండలంలో రూ.కోటితో నిర్మిస్తున్న కేశవాపూర్ – తూంకుంట బీటీ రోడ్డు పనులకు భూమి పూజ, ఉద్దెమర్రి, ఆద్రాస్పల్లి, కేశవాపూర్, అనంతారం గ్రామాల్లో సీసీ రోడ్లు, కుల సంఘాల భవనాలు, దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. మహిళా భాగస్వామ్యంతో సమాజం అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ప్రభుత్వం కల్పించే రుణ సదుపాయంతో మహిళలు వ్యాపారంలో రాణించాలని సూచించారు. జవహర్నగర్లో త్వరలో 324 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఔట్ ప్రారంభం కానుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, కేశవరం, లింగాపూర్ తండా, నాగిశెట్టిపల్లి గ్రామాలను దత్తత తీసుకుని రూ.69 కోట్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పర్యటన కొనసాగింది.
బీఆర్ఎస్లో చేరిక
అనంతారం గ్రామంలో ఉప సర్పంచ్ సీహెచ్ రాజు, ఉద్దెమర్రి గ్రామంలో 6వ వార్డు సభ్యులు కూరాకుల అంజమ్మతో పాటు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.