ప్రజలకు కలెక్టర్ శర్మన్ సూచన
అమీర్పేట్, ఏప్రిల్ 18: నగరంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాలను సందర్శించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శర్మన్ ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ఆరోగ్య మేళాను సోమవారం సనత్నగర్లోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్భారత్, ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో ఈనెల 18నుంచి 22వరకు 15చోట్ల ఆరోగ్య మేళాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ మేళాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యాంత్రిక జీవన విధానంలో జీవన శైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, ఊబకాయం తదితర వ్యాధులు అధికంగా వస్తున్నాయన్నారు.
వీటిని అధిగమించేందుకు యోగా, మెడిటేషన్, శారీరక శ్రమ వంటి వాటిని జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి మాట్లాడుతూ స్పెషలిస్టుల ద్వారా వివిధ రకాల హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నామని, ఆరోగ్యసంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు ఆరోగ్యమేళాలను సందర్శించాల్సిందిగా డా.వెంకటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తొలిరోజున 375మందికి ఆయుష్మాన్భారత్ డిజిటల్ ఐడీని క్రియేట్చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీబాల్రెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ నిర్మలా ప్రభావతి, పబ్లిక్ హెల్త్ అధికారి డా.రేవతి, టీఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.