శ్రీరాంనగర్, బోరబండ పీహెచ్సీలను సందర్శించిన డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటి
జూబ్లీహిల్స్, ఏప్రిల్7: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. పీహెచ్సీలలో అందుతున్న ఆధునిక వైద్య సేవలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లోని శ్రీరాంనగర్, బోరబండ పీహెచ్సీలతో పాటు జిల్లాలోని 40 పీహెచ్సీలను కాయకల్ప పురస్కారాలకు నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎన్ క్వాస్ డిస్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ హకీం, ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధతో కలిసి శ్రీరాంనగర్, బోరబండ పీహెచ్సీలను ఆయన సందర్శించారు. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) ప్రమాణాలకు అనుగుణంగా నగరంలోని పీహెచ్సీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్న పీహెచ్సీలు ఈ ‘ఎన్క్వాస్’ కార్యక్రమంతో ఆధునీకతను సంతరించుకోనున్నాయని తెలిపారు. ఇప్పటికే టీఎస్ఎంఐడీసీ ద్వారా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలలో షెడ్ల నిర్మాణం చేపట్టామని, ఎన్ క్వాస్ కార్యక్రమంతో పీహెచ్సీల్లో ఆయా విభాగాలకు ప్రత్యేక కౌంటర్లు, ఆధునిక టైల్స్, ఇతరత్రా సౌకర్యాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆధునీకరించిన పీహెచ్సీలకు కాయకల్ప పురస్కారాలు ప్రదానం చేసి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పీహెచ్సీలకు గ్రేడింగ్ ఇచ్చి 70 శాతానికి పైగా మార్కులు పొందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ జాతీయ స్థాయి పురస్కారాలు అందిస్తారని వెల్లడించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ అశ్రిత, పీహెచ్ఎన్ మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.