బోడుప్పల్, జూలై28 : ఈ యేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఆదరణ పెరిగిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి చిల్డ్రన్ ట్రస్ట్, మల్లారెడ్డి సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోడుప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చెంగిచర్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి నోటు బుక్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధించే సమయంలో విద్యార్థులు శ్రద్ధతో ఆలకించాలన్నారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.
గురుకుల విద్యాలయాలు దేశానికే ఆదర్శం..
గురుకుల విద్యాలయాల నిర్వహణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో నంబర్-1 స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.మన ఊరు మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. టెప్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ ఆర్థిక సహకారంతో బోడుప్పల్ ప్రభుత్వ పాఠశాలలో రూ.80లక్షలతో అదనపు గదులు నిర్మించడం హర్షణీయమన్నారు. కంపెనీ తరపున హాజరైన సుజాతను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, నాయకులు మీసాల కృష్ణ, రవిగౌడ్, చక్రపాణిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.