చార్మినార్, ఏప్రిల్ 3 : పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మొఘల్పుర ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన ఒబైద్, ఒవైస్లు కొన్నాళ్ల కిందట నగరానికి వలస వచ్చి మొఘల్పుర పోలీస్స్టేషన్ పరిధిలోని సర్దార్ మహల్ ప్రాంతంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. స్థానికంగా నివాసముండే సోహెల్తో కలిసి బంగారు ఆభరణాలు తయారుచేసే కర్మాగారాన్ని ప్రారంభించి అక్కడ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. అయితే ఒవైస్, సోహెల్లపై మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల తస్కరణ, గోల్ట్ స్మగ్లింగ్లపై ఫిర్యాదులు రావడంతో మైలార్దేవ్పల్లి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సోహెల్, ఒవైస్లు మొఘల్పుర పోలీస్స్టేషన్ పరిధిలోని సర్థార్ మహల్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో ఆదివారం రాత్రి డీఐ రాజశేఖర్రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా నిందితుల స్నేహితుడు ఖాదర్ పోలీసులను అడ్డుకున్నాడు. తాము దర్యాప్తులో భాగంగా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ నుంచి వచ్చామని, నిందితులను అదుపులోకి తీసుకోవడానికి సహకరించాలని కోరినప్పటికీ పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా తన వద్ద విధులు నిర్వహించే కార్మికులను పోలీసులపైకి ఉలిసిగొల్పాడు. వచ్చింది పోలీసులు కాదు.. దొంగలంటూ కార్మికులకు రెచ్చగొట్టాడు. ఓ వైపు పోలీసులు తమ గుర్తింపు కార్డులను చూపించినా వినకుండా దాడులకు పాల్పడ్డారు. నిందితులతో పాటు దాడికిపాల్పడిన వారంతా అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల దాడిలో గాయపడిన మైలార్దేవ్పల్లి పోలీసులు మొఘల్పుర పోలీస్స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.