మైలార్దేవ్పల్లి : తెలంగాణకు బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం అందించడం కేసీఆర్తోనే సాధ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి టి. ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో నిర్వహించిన ర్యాలీలు, రోడ్ షోలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్( BRS) పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను(Welfare Schemes) ప్రవేశపెడుతున్నారని తెలిపారు.
18 ఏళ్లు నిండిన యువతులకు సౌభాగ్య లక్ష్మి పేరుతో నెలకు మూడు వేలు, ఆసరా (Aasara) పేరుతో ఐదు వేల ఫించన్, గ్యాస్ సిలిండర్ రూ.400, తెల్లరేషన్ కార్డు దారులకు నాణ్యమైన సన్నబియ్యం, రైతు బీమా, ఆరోగ్య శ్రీ కవరేజీని 15 లక్షలకు పెంపు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందన్నారు. నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉంచడం వల్ల హైదరాబాద్కు ఐటీ, ఫార్మా కంపెనీలు క్యూ కడుతున్నాయని అన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో శ్రమిస్తుందన్నారు. మాయమాటలతో మభ్యపెట్టే బీజేపీ, కాంగ్రెస్లను నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండే తనకు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.