హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తీరును నిరసిస్తూ గాంధీభవన్లో ఆందోళన చేశారు. ఎమ్మెల్యే యాదయ్య స్థానిక కాంగ్రెస్ నేతలకు అవకాశమివ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతూ..ప్రాధాన్యమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మే 12న సీనియర్ నేత సామ వెంకట్రెడ్డిని ప్రకటించారు. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ యాదవ్ సిఫారసు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఆయన్ను నియమించారు. కానీ, తాజాగా జూన్ 29న ఎమ్మెల్యే యాదయ్య తన వర్గానికి చెందిన రావుగారి వెంకట్రెడ్డిని మండల పార్టీ అధ్యక్షుడిగా సిఫారసు చేయడంతో సామ వెంకట్రెడ్డి స్థానంలో మళ్లీ రావుగారి వెంకట్రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ఆగ్రహం చెందిన సామ వెంకట్రెడ్డి మద్దతుదారులు గాంధీభవన్లో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య హఠావో.. కాంగ్రెస్ పార్టీకో బచావో అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫ్లెక్సీని దహనం చేశారు.