చర్లపల్లి, జనవరి 1 : లారీ డ్రైవర్లపై కేంద్రం విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జనసేవ డ్రైవర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షకీల్, నాయకులు లాలాగౌడ్, జమ్మల్, సురేశ్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(హెచ్పీసీఎల్) పరిశ్రమ వద్ద హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్, గెల్, ఐబీపీ లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే డ్రైవర్లును బాధ్యులు చేస్తూ 7 లక్షల నగదు నష్టపరిహారం చెల్లింపు, పది సంవత్సరాల శిక్ష విధిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం సరికాదన్నారు. ఈ నెల 5న చర్లపల్లిలో డ్రైవర్ల సమస్యలపై సమావేశం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ యూనియన్ నాయకులు రమేశ్, జమ్మయ్య, సయ్యద్ రిజ్వాన్, రాజిరెడ్డి, మల్లారెడ్డి, కృష్ణ, సైదులు, అజ్ఘర్, రాజుపాటిల్, కేపీ.పాండే, సిద్దియాదవ్లతో పాటు వందలాది మంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.