కవాడిగూడ: భూదాన్ భూములను రక్షించి, భూదాన యజ్ఞబోర్డును ఏర్పాటు చేసి, భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్వోదయ మండలి, తెలంగాణ సర్వసేవ సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా నిర్వహించారు.
సర్వసేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో అఖిల భారత సర్వసేవ సంఘ్ జాతీయ అధ్యక్షుడు చందన్పాల్, ప్రధాన కార్యదర్శి గౌరంగా చంద్ర మహాపాత్ర, సంఘ్ జాతీయ ట్రస్టీ షేక్సీపియన్,మాజీ ఎంపీ అజీజ్ పాషా, సీపీఐ కార్యవర్గ సభ్యుడు డీజీ నర్సింగరావు, ప్రసాద్, సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నర్సింహ తదితరులు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా చందన్ పాల్ మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ కోసం 1951 ఏప్రిల్లో మహాత్మాగాంధీ శిష్యుడు ఆచార్య వినోభా భావే భూదాన్ ఉధ్యమం రక్తరహిత విప్లవం తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించారని, ఆనాడు ఉధ్యమానికి ఆకర్షితులై ధనవంతులైన భూస్వాములు, జమీందారులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1లక్షా 70 వేల ఎకరాలు ఆచార్య వినోభా భావేకు విరాళంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయని, భూదాన భూములను కాపాడి నిరుపేదలకు పంచాలని కోరారు. తక్షణమే భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి ఆక్రమణకు గురైన భూదాన భూములపై సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టి భూ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలి నేతలు యాదిరెడ్డి, యాదయ్య, మురళి, రాజు నాయక్, అమీనా తదితరులు పాల్గొన్నారు.