మియాపూర్ , జనవరి 18: ఆస్థిపన్ను వసూళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగవంతం చేయాలని గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అల ప్రియాంక ఆదేశించారు. కొన్ని డాకెట్లలో సిబ్బంది వెనకబడి ఉన్నారని, సంబంధిత పర్యవేక్షక అధికారులు బాధ్యత వహించి వేగిర పరచాలని పేర్కొన్నారు. జోనల్ స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లపై జడ్సీ ప్రియాంక డీసీలు, ఏఎంసీలు, టీఐలు, బిల్ కలెక్టర్లతో జోనల్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థలకు విధిగా వెళ్లి పన్ను వసూళ్లను చేపట్టాలన్నారు. రోజువారీగా లక్ష్యాలను నిర్ధారించుకుని లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలని పేర్కొన్నారు. గతంలోనూ పన్ను వసూళ్లపై సమీక్ష సందర్భంగా పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించామని, ఇంకా కొందరు వెనకబడుతున్నారని, తీరుమారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని జడ్సీ స్పష్టం చేశారు. ఏఎంసీలు, డీసీలు రోజువారీగా సర్కిల్ పురోగతిని సమీక్షించుకోవాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి సిబ్బందికి మార్గదర్శనం చేయాలని ఆమె సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 3 నెలలే గడువున్నందున లక్ష్యాన్ని అంతకు మునుపే చేరుకోవాలని జడ్సీ ప్రియాంక పేర్కొన్నారు. కొవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, డీసీలు సుధాంశ్ నందగిరి, వెంకన్న నాయక్, రమేశ్, బాలయ్య, ఏఎంసీలు, టీఐలు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.