అబిడ్స్ : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టీజీవో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో వివిధ హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. గత యేడాది సెప్టెంబర్లో నూతనంగా 161 పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడిన పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులతో కలిపి జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ వరకు 600మందికి పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్లకే దక్కుతుందన్నారు. శాఖ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో పదోన్నతులు కల్పించడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దేవేందర్, కోశాధికారి గిరిధర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సలహాదారులు రవి, రమేశ్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.