నాంపల్లి క్రిమినల్ కోర్ట్, ఆగస్ట్ 13(నమస్తే తెలంగాణ): చట్టం ముందు అం దరూ సమానులేనని సిటీ స్మాల్ కాజ్ కోర్టు చీఫ్ జడ్జ్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో వినూత్న ర్యాలీ నిర్వహించింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు సిటీ సివిల్ కో ర్టు చీఫ్ జడ్జ్ రేణుక యారా ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పురాణ హవేలీలోని సిటీ సివిల్ కోర్టు నుంచి చార్మినార్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు.
అన్ని వర్గాల, మతాల ప్రజల, ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహించారు. చట్టం ముందు అందరూ సమానులే అంటూ రాజ్యాంగ స్ఫూర్తిని, సమానత్వాన్ని చాటుతూ స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్లు భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనిని సిటీ స్మాల్ కాజ్ కోర్టు చీఫ్ జడ్జ్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబ ప్రారంభించారు. 26వ అదనపు చీఫ్ జడ్జ్ డా.సున్నం శ్రీనివాస్రెడ్డి, వాణిజ్య న్యాయస్థాన న్యాయమూర్తి డా.పట్టాభి రామారావు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె.మురళీమోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రన్, షహీన్ ఎన్జీవో ప్రతినిధి జమీల, పెండేకంటి న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.