కేపీహెచ్బీ కాలనీ, జనవరి 28 : మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కూకట్పల్లి డివిజన్లో రూ.1.10 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గంలో వేలాది కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రిజర్వాయర్లు నిర్మించి పైప్లైన్ వ్యవస్థలను ఆధునీకరించి భవిష్యత్లో సమస్యలు తలెత్తకుండా పనులు చేసినట్లు తెలిపారు. కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్గత రోడ్లన్నింటినీ బాగుచేసినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, ఖాళీ స్థలాలను క్రీడా ప్రాంగణాలుగా, పార్కులుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు, వర్షాలతో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు.
చెరువుల అభివృద్ధి..
కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. చెరువుల పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో మురుగునీరు చేరకుండా నీటిని శుద్ధి చేసేలా ఎస్టీపీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చేపట్టిన ఎస్టీపీ పనులు పూర్తైతే మురుగునీరు శుద్ధి జరిగి చెరువుల్లోకి స్వచ్ఛమైన నీరు చేరుతుందన్నారు. తద్వారా చెరువులన్నీ స్వచ్ఛమైన నీటితో కళకళలాడంతోపాటు దోమల వృద్ధి నియంత్రించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించినట్లు తెలిపారు. ఆయా కాలనీలు, బస్తీల్లో ఎక్కడైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే నిధులు మంజూరు చేసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు బొట్టు విష్ణు, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.