సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): చదువుకున్న మహిళలే కాకుండా చదుకోని మహిళలు కూడా స్టార్టప్స్ నిర్వహిస్తూ అమోఘంగా రాణిస్తున్నారు. గ్రామీణ మహిళలకు వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు చేయడంపై శిక్షణనిస్తామని, దేశ వ్యాప్తంగా ఉన్న 15వేల స్వయం సహాయక బృందాలను ఎంపిక చేస్తామని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 77వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా ప్రకటించారు. ప్రధానమంత్రి కీలకమైన ప్రకటన పట్ల హైదరాబాద్ డ్రోన్ స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ ఇస్లావత్ హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజానం మారు మూల గ్రామాల ప్రజలకు చేరువైతేనే అభివృద్ధి జరుగుతున్నదని, అలాంటి నిర్ణయాన్నే దేశ ప్రధాన మంత్రి ప్రకటించారన్నారు. సాంకేతికంగా నైపుణ్యం కలిగిన దేశాన్ని సృష్టించే లక్ష్యంలో భాగంగా ఈ చొరవ తీసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.
దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు అవసరమైన డ్రోన్లను తయారు చేసి, సరఫరా, నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ప్రధాన మంత్రి ప్రకటించినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను నిర్వహించడం, మరమ్మతులు చేపట్టడంలో శిక్షణనిస్తామని ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్ స్టార్టప్గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మారుత్ డ్రోన్ దేశ వ్యాప్తంగా డ్రోన్ వినియోగాన్ని విసృత్తంగా చేపడుతోందని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో మారుత్ డ్రోన్ల స్టాల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించి డ్రోన్ల ఉపయోగాలను తెలుసుకున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో 80 శాతం గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతున్నారు. అలాంటి వారికి డ్రోన్ టెక్నాలజీలో ప్రభుత్వమే చొరవ తీసుకొని శిక్షణనివ్వడం ద్వారా ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం, చాలా తక్కువ మంది మహిళలు డ్రోన్ల గురించి పరిజ్ఞానం కలిగి ఉన్నారు. దీని ద్వారా ఒకేసారి వేలాది మంది అవగాహన పొందడమే కాకుండా డ్రోన్స్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం కలుగుతున్నదన్నారు.