జూబ్లీహిల్స్ జోన్ బృందం : అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డిమాండ్ చేశారు.
గుజరాత్ కంటే గణనీయంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణపై అక్కసుతో రాష్ట్ర అభివృద్ధిని సైతం అడ్డుకుంటూ.. చట్టసభల సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానించిన మోడీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం కార్పొరేటర్లు దేదీప్య విజయ్, బాబాఫసియుద్దీన్, రాజ్కుమార్ పటేల్, సీఎన్రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయా డివిజన్లలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానించడమే అలవాటుగా మార్చుకున్న ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయకుంటే ఢిల్లీవచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా యూసుఫ్గూడ, బోరబండ, రహ్మత్నగర్, ఎర్రగడ్డ డివిజన్ల నుంచి గన్పార్కులోని అమరవీరుల స్థూపంవద్దకు ర్యాలి నిర్వహించి అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, ప్రదీప్, అప్పూఖాన్, సంతోష్, కృష్ణమోహన్లతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.