హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్-ప్యాక్స్) విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే కొత్తగా 100 ప్యాక్స్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ప్రభుత్వ అనుమతి రాగానే కొత్త ప్యాక్స్లను ఏర్పాటు చేయనున్నది. రైతులకు రుణాలతోపాటు పలు రకాల సేవలు అందించడంలో ప్యాక్స్లు ముందువరుసలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 906 ప్యాక్స్లు ఉన్నాయి. కొత్త ప్యాక్స్లు ఏర్పాటైతే వీటి సంఖ్య వెయ్యి దాటనున్నది. కొత్త ప్యాక్స్ల ఏర్పాటుతో రైతులకు సేవలు మరింత చేరువకానున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం రైతులకు రుణాలు ఇవ్వడం, ధాన్యం కొనుగోలు చేయడం వంటి మూడు, నాలుగు సేవలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్యాక్స్ను కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)గా మార్చి రైతులకు సుమారు 25 నుంచి 30 సేవలను అందించేలా టెస్కాబ్ కసరత్తు చేస్తున్నది.
వైద్యనాథన్ కమిషన్ సిఫార్సులతో కోత
వాస్తవానికి 2005కు ముందు తెలంగాణ ప్రాంతంలో సుమారు 1,800 వరకు ప్యాక్స్ ఉండేవి. కానీ నాటి కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల సంస్కరణలపై ఏర్పాటు చేసిన వైద్యనాథన్ కమిషన్ ప్యాక్స్ల సంఖ్యను కుదించాలని ప్రతిపాదించింది. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు తెలంగాణలోని 1,800 ప్యాక్స్లను 906కు కుదించారు. అంటే రాష్ట్రంలో మరో వెయ్యి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అవసరం ఉందనేది స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలోనే టెస్కాబ్ అధికారులు కూడా విడతలవారీగా మరో వెయ్యి ప్యాక్స్ ప్రారంభించాలని యోచిస్తున్నారు.
భవిష్యత్తులో మండలానికి రెండు..
ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ప్యాక్స్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల ముందుంచింది. కానీ ఇది వాణిజ్యపరంగా సాధ్యం కాదని తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్యాక్స్ ఏర్పాటుకు టెస్కాబ్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్నిచోట్ల 5 గ్రామాలకు ఒకటి, మరికొన్ని చోట్ల 10 గ్రామాలకు ఒకటి చొప్పున ప్యాక్స్ ఉన్నాయి. ఇలా కాకుండా దీనిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 100 ప్యాక్స్లను ఏర్పాటు చేసి.. భవిష్యత్తులో మండలానికి కనీసం రెండు చొప్పున ఏర్పాటు చేయాలని టెస్కాబ్ అధికారులు భావిస్తున్నారు.
రైతులకు మరిన్ని సేవలు..
అవసరమైన సంఖ్యలో రాష్ట్రంలో ప్యాక్స్ లేవు. ఈ నేపథ్యంలో తొలి దశలో కొత్తగా 100 ప్యాక్స్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీటి ఏర్పాటును పూర్తి చేస్తాం. కొత్త మండలాలు, కొత్త గ్రామపంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేయనున్నాం. తద్వారా అక్కడి రైతులకు ప్యాక్స్ సేవలను చేరువచేయనున్నాం. ప్యాక్స్ను కామన్ సర్వీస్ సెంటర్గా మార్చేసి 30 వరకు సేవలను రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టాం. రైతులకు ఉత్తమ, నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.
– కొండూరి రవీందర్రావు, టెస్కాబ్ చైర్మన్