President Murmu | సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈనెల 19న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు హెచ్పీఎస్ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏడాది పొడుగునా జరుగుతున్న శతాబ్ది వేడుకల్లో భాగంగా మ్యూజియంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం పలు శాస్త్ర, సాంకేతిక ప్రయోగశాలలను సందర్శిస్తారని చెప్పారు. ఈనెల 20న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఎంఎన్ఆర్ విద్యాసంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొననున్నట్లు సంస్థ ప్రతినిధులు సోమవారం తెలిపారు. 1974లో ప్రథమంగా ఎంఎన్ఆర్ స్కూల్ను స్థాపించి అంచెలంచెలుగా విద్యారంగంలో ఎదిగినట్లు సంస్థ చైర్మన్ ఎంఎన్ రాజు పేర్కొన్నారు.