President Droupadi Murmu | సిటీబ్యూరో, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ) : విశిష్టమైన సాంస్కృతిక వారసత్వ మూలాలు, పుష్కలమైన విద్యా, ఉద్యోగ వనరులతో పాటు కలిగిన రాష్ట్రంగా.. సిరిసంపదలతో సుభిక్షంగా ఉన్న ఈ తెలంగాణ నిజమైన కోటి రతనాల వీణ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రముఖ విద్యా, వైద్య రంగాల్లో సామాజిక బాధ్యతతో సేవలందిస్తున్న ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 50 వార్షికోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్, నిష్ణాతులైన ఐటీ మానవ వనరులతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ఇక్కడి ఐటీ నిపుణులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్నదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందని, హెల్త్ కేర్ హబ్గా నిలుస్తోందని కొనియాడారు. ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 50 వార్షికోత్సవం ఆమె పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మంత్రి సీతక్క, చైర్మన్ ఎంఎన్ రాజు, వైస్ చైర్మన్ రవి వర్మ, డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్స్ డా. రవి జీలకర్ర, ఫార్మా విభాగం ప్రిన్సిపాల్, డా. ఆళగర్ స్వామి, ఎంఎన్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.