మాతాశిశు సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం కాబోయే అమ్మకు మరో కానుక ప్రకటించింది. గర్భవతులకు బలవర్ధక ఆహారం అందించాలనే సదుద్దేశంతో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు దశాబ్ది ఉత్సవాల్లో రూ. 2 వేల ఖరీదైన పదార్ధాలతో కిట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు.
గర్భిణీలకు ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించి, హిమోగ్లోబిన్ శాతం పెంచే ఉద్దేశ్యంతోనే ఈ కిట్స్ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. గర్భిణీలకు పోషకాహారం అందించడం వల్ల పుట్టబోయే శిశువు ఆరోగ్యం కూడా మెరుగవుతుందని తెలిపారు.
– సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ)