సిటీబ్యూరో, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఎస్టీపీ పనుల్లో వేగం పెంచి తుది దశలో ఉన్న వాటిని ట్రయల్ రన్ కోసం సిద్ధం చేయాలని వాటర్బోర్డు ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ఫతేనగర్, పెద్ద చెరువు, నల్ల చెరువుల ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించారు. మొదట ఫతేనగర్లో 133 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఎస్టీపీ దగ్గరకు వెళ్లిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎస్టీపీ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పనులు వేగంగా జరిగేందుకు అదనంగా కార్మికులను సమకూర్చుకోవాలని సూచించారు. 24 గంటల పాటు పనులు జరిగేలా చూడాలని, వీరంతా 3 షిప్టుల్లో పనిచేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో పనిచేసేందుకు వీలుగా పనులు జరిగే ప్రదేశంలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన సివిల్ పనులు పూర్తి చేసి యంత్రాల బిగింపు ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. అనంతరం పెద్ద చెరువు, నల్ల చెరువు ఎస్టీపీలను సందర్శించి అక్కడి అంతర్గత రహదారులు, సుందరీకరణ, పెయింటింగ్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన చిన్న చిన్న పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, ఈ నెలాఖరు కల్లా ట్రయన్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. పని జరిగే ప్రదేశంలో కార్మికులందరూ తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.
3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో 31 ఎస్టీపీలు
మొత్తం 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో నిర్మిస్తున్న 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే నగరంలో ఉత్పన్నమయ్యే మురుగు నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, వీటి ద్వారా రోజుకు 1282 ఎంజీడీల ముగురునీటిని శుద్ధి చేయవచ్చన్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతుందని ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, ఎస్టీపీ సీజీఎంలు రఘు, సుజాత, జీఎంలు, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.