కరోనా రెండోదశలో వైరస్ సోకి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు నిండిపోయాయి. కొన్నిచోట్ల ఒక పడక ఖాళీ అయితేనే ఇంకో రోగిని చేర్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్కు విపరీత డిమాండ్ ఉన్న నేపథ్యంలో బాలానగర్ పారిశ్రామికవాడ శ్రీవెంకటేశ్వర కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ప్రీమియర్ ఆక్సిజన్ కంపెనీ వ్యాపార వినియోగానికి స్వస్తి చెప్పి రోగుల కోసం ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నది. సాధారణంగా ఇండస్ట్రియల్ వినియోగం (ఫ్యాబ్రికేషన్) కోసం ఆక్సిజన్ విక్రయించేవారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వ్యాపారానికి ఆక్సిజన్ సిలిండర్ల విక్రయాలు నిలిపివేసి ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. ఒక సిలిండర్లో 7 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉంటుందని, రోజుకు 650 ఆక్సిజన్ సిలిండర్లను విక్రయిస్తామని ప్రీమియర్ ఆక్సిజన్ కంపెనీ ఎండీ రాంగోపాల్ పేర్కొన్నారు.