తెలుగుయూనివర్సిటీ, జూలై 1: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఖ్యాతిని ఇనుమడింపజేసేలా పరిపాలన కొనసాగిస్తానని ఆచార్య తంగెడ కిషన్రావు అన్నారు. తెలుగువర్సిటీకి 11వ ఉపకులపతిగా ఇటీవల నియమితులైన కిషన్రావు.. తన చాంబర్లో విలేకరుల సమావేశంలో వర్సిటీ ప్రణాళికను వివరించారు. 1985లో నెలకొల్పిన వర్సిటీకి ఇప్పటివరకు 10మంది వీసీలుగా పనిచేశారని, ఈ పది మందిలో తుమాటి దోణప్ప తప్ప మిగిలిన అందరితో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఆచార్య ఎన్.గోపి, అనుమాండ్ల భూమయ్య, తాను ఓయూలో 1971లో ఒకే తరగతిలో చదువుకున్నా.. వారు తనకంటే ముందే వీసీలుగా పనిచేశారని గుర్తు చేశారు.
నాంపల్లిలో కొనసాగుతున్న పరిపాలనా భవనంతో పాటు తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలోగల బాచుపల్లిలోని క్యాంపస్కు తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆరు నెలల్లో మొత్తం నిర్మాణ పనులు పూర్తి చేసి.. అధునాతన సౌకర్యాలను కల్పించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు సూచించామని తెలిపారు. బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులకు, అధ్యాపకులకు, ఉద్యోగులకు పెద్ద దూరం కాదని.. అవసరమైతే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. అయితే.. నాంపల్లి పరిపాలన భవనంలో విద్యార్థులకు ప్రాథమిక సమాచారం అందించే కేంద్రం కొనసాగుతుందన్నారు. అలాగే.. సాయంకాలం కోర్సులు ఇక్కడే కొనసాగుతాయన్నారు.
బాచుపల్లి క్యాంపస్లో తాగునీటి సమస్య ఉందనే అపోహాల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం విజిటింగ్ అధ్యాపకులను నియమించుకుని తరగతులను కొనసాగిస్తామన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్, నాల్గవ తరగతి ఉద్యోగుల లోటు అంతగా లేదన్నారు. నిలిపివేయబడిన కోర్సులను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. తెలుగువర్సిటీకి పేరు మార్పు కూడా అవసరం ఉందన్నారు. ఇన్చార్జి వీసీ పరిపాలనలో గడిచిన మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన అవార్డులు, పురస్కారాల ఎంపిక ప్రక్రి య పూర్తిచేసి త్వరలోనే అందజేస్తామన్నారు. తెలుగువర్సిటీకి ఆదాయాన్ని సమకూర్చే ఆడిటోరియాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనల నిర్వహణకు ఆయా సంస్థలకు అద్దెకు ఇస్తామని ప్రకటించారు.