చిక్కడపల్లి, మే 18 : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామని విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్. వినయ్ కుమార్ తెలిపారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను తెలంగాణ ప్రజా సంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజర్ రమణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ సుందరయ్య స్మృతిలో ఆయన ఆశయాలను కొనసాగించడానికి 1987 సంవత్సరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.
విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ వంటి వాటిలో కేంద్రం ద్వారా నిర్వహిస్తున్నామని వివరించారు.
సుందరయ్య వర్ధంతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక ప్రముఖుడి చేత ముఖ్యమైన అంశంపై స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగా సోమవారం ఎస్వీకే ట్రస్ట్ అధ్యక్షుడు బీవీ రాఘవులు అధ్యక్షతన ‘నేటి రాజకీయాలు-భగత్ సింగ్ ప్రాసంగికత’ అంశంపై పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ చమన్ లాల్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభలో ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ప్రసంగిస్తారని తెలిపారు. సభ అనంతరం భగత్ సింగ్ పై ఏకపాత్రాభినయం, నాటిక, సుందరయ్య పై రాసిన పాటలకు నృత్య ప్రదర్శన ఉంటుందని, ఆటలు వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.