బంజారాహిల్స్, అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ ప్రచారానికి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటో నడుపుతూ ఫొటోలకు పోజులివ్వడంపై ఆటోడ్రైవర్లు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రచారంలో భాగంగా శనివారం యూసుఫ్గూడకు వచ్చిన ఆయన, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్తో కలిసి ఆటో ఎక్కి కొంతదూరం నడిపించారు.
ఈ తతంగాన్ని గమనిస్తున్న ఆటోడ్రైవర్లు ‘కాంగ్రెసోళ్లు ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగం చేశారు.. బస్సు ఫ్రీ అంటూ చెప్పి మమ్మల్ని రోడ్డున పడేశారు.. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదు. అసలే కోపంతో ఉన్న ఆటోడ్రైవర్లకు పుండుమీద కారం చల్లేలా మంత్రి ప్రచారం కోపం తెప్పించినట్టు ఉంది..’ అని గొణుక్కోవడం కనిపించింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధి ఆటోడ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తారని మంత్రిని ప్రశ్నించగా త్వరలోనే అంటూ జారుకున్నారు.