ఎల్బీనగర్ : మున్నూరుకాపులు నమ్మకానికి ప్రతీకలని, మాట ఇస్తే మడమ తిప్పరని, మాట మరువరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బుధవారం మున్నూరుకాపుల దసరా, దీపావళి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మున్నూరు కాపుల మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మాట ఇచ్చిన మున్నురుకాపులు మాట నిలుపుకుంటారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్(CM KCR) కు సబ్బండ వర్ణాలు ఈ ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నాయని పేర్కొన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ మున్నూరుకాపుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తగ్గించడానికి దేశంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పార్కులను అభివృద్ధి చేశానన్నారు. హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహాకారంతో తీర్చిదిద్దుతానని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ మున్నూరుకాపులు సంఘటితంగా, సమైక్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో మున్నురుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుటం పురుషోత్తంరావు, మాజీ కౌన్సిలర్ త్రివేది, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు పటేల్, మల్యాల మదన్ పటేల్, అరుణా పటేల్, ఎల్బీనగర్ మున్నురుకాపు సంఘం అధ్యక్షుడు తోట రాజు పటేల్, ప్రధాన కార్యదర్శి అనంతుల నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.