మానవాళి చరిత్రలో నీటికి ప్రత్యేక స్థానముంది. ప్రపంచ నాగరికతలు విలసిల్లింది జలవనరులు ఉన్న చోటనే.. జీవజలం ప్రాధాన్యతను ఆనాడే గుర్తించిన కాకతీయులు తమ ఇంజినీరింగ్ నైపుణ్యంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా గొలుసుకట్టు చెరువులు నిర్మించి తెలంగాణ చెరువులను పల్లెలకు జీవ నాడులుగా మలిచిన తీరు అద్భుతం..అసమానం. చెరువే ఊరికి ఆదెరువు అని ఓ పాటలో అంటాడు ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. అంతటి నీటి ప్రాధాన్యాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణలో మిషన్ కాకతీయతో బీడు భూములకు జీవం పోశారు. చెరువులను పునద్ధరణ చేసి ప్రపంచానికే జల పాఠాలు నేర్పారు.
సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వనరులు పునర్జీవనాన్ని పొందుతున్నాయి. సహజ సిద్ధంగా ఉన్న నీటి వనరులకు కించిత్తు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి- సుందరీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేందుకు దాదాపు రూ. 510.5 కోట్లను ఖర్చు చేస్తున్నది. చెరువుల చుట్టూ ఫెన్సింగ్, ఎంట్రన్స్ ఫ్లాజా, లైటింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులను ఆకర్షించేలా బ్యూటిఫికేషన్, పరిసర ప్రాంతాలలో ఆహ్లాదం, ఆనందాన్ని పంచే పూలు మొక్కలు, వాకర్స్, పర్యాటకులకు వీలుగా బెంచీలు తదితర బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. పూడికతీత, మురుగునీటి మళ్లింపు, ఐ అండ్ డీ (ఇంటరాప్షన్ అండ్ డైవర్షన్), ల్యాండ్ స్క్రేపింగ్, ఫ్లాంటేషన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, లైటింగ్, హ్యాండ్ రెయిలింగ్ పనులు చేపట్టి పర్యాటక క్షేత్రాలుగా చెరువులను తీర్చిదిద్దుతున్నారు.
కొత్వాల్ చెరువుకు కొత్తందాలు
మహేశ్వరం, జూన్ 7: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి పల్లెలు సస్యశామలంగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు పూడికతీతతో నేడు గ్రామాలు జలకళను సంతరించుకుంటున్నాయి. మహేశ్వరం మండలంలోని కొత్వాల్ చెరువును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దడానికి కోట్ల రూపాయలు వెచ్చించి చెరువు కట్టను నిర్మిస్తున్నారు.
హస్మత్పేట చెరువు కిస్మత్ మారింది
బాలానగర్, జూన్ 7 : ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట బోయిన్ చెరువు ఉమ్మడి రాష్ట్రంలో (నాడు) గుర్రపు డెక్క నిండిపోయి దుర్వాసనలు వెదజల్లేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెరువుల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే హస్మత్పేట బోయిన్ చెరువు సుందరీకరణకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక చొరవ చూపించి రూ. 22 కోట్ల నిధుల కేటాయించారు. తద్వారా చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
వీకెండ్ స్పాట్గా కోకాపేట కొత్తచెరువు
మణికొండ, జూన్ 7 : బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోకాపేట కొత్తచెరువుకు హైటెక్ హంగులను అలుముకుంది. చెరువును అభివృద్ధి చేయడంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జలకళతో నిండుకుండను తలపిస్తున్నది. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లతో పాటు పాదాచారులకు, ప్రేమపక్షులకు ఈ ప్రాంతం వీకెండ్ అడ్డాగా మారింది.
పర్యాటక క్షేత్రంగా ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు
మేడ్చల్, జూన్ 7 : ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు దాదాపు 450 ఎకరాల్లో విస్తరించింది. ఈ చెరువును రూ.6.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ చెరువు కింద 2500 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. చెరువు కట్టను పట్టిష్టం చేశారు. కట్టపై రోడ్డు వేశారు. చెరువు చుట్టూ గ్రిల్ను ఏర్పాటు చేశారు. పూడిక తీసి, అలుగును ఆధునీకరించారు. తూంలకు మరమ్మతు చేశారు. బతుకమ్మలు, వినాయక నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. నేడు అభివృద్ధి చేసిన చెరువు పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తున్నది.
కుమ్మరికుంటకు మహర్దశ
హయత్నగర్, జూన్ 7 : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కుమ్మరికుంట చెరువును రూ.36 లక్షలతో, బాతుల చెరువును రూ.50 లక్షలతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. బాతుల చెరువు, కుమ్మరికుంట చెరువుల పూడికతీత పనులు చేపట్టగా చెరువు కట్టలకు మరమ్మతులు చేపట్టారు. గతంలో కురిసిన వర్షాలకు ప్రస్తుతం ఆయా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
నిండు కుండలా మన్సూరాబాద్ పెద్ద చెరువు
మన్సూరాబాద్, జూన్ 7: వర్షా కాలంలోనూ చుక్క నీరులేని స్థితిలో ఉండే మన్సూరాబాద్ పెద్ద చెరువు.. ఇప్పుడు ఎండా కాలంలోనూ నిండుకుండలా కనపడుతున్నది. చెరువుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులతో మన్సూరాబాద్ పెద్ద చెరువు రూపురేఖలు మారిపోయి మినీ ట్యాంక్బండ్గా మారిపోయింది. మన్సూరాబాద్ పెద్ద చెరువు అభివృద్ధిపనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో మన్సూరాబాద్ పెద్ద చెరువు ఆహ్లాదకరంగా మారింది.
మోహిని చెరువు అందాలు..ముగ్ధ మనోహరం
అంబర్పేట, జూన్ 7 : తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ నాలుగో ఫేస్లో అంబర్పేట నియోజకవర్గం, ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఉన్న మోహిని చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టింది. నీటి పారుదల శాఖ ఇందుకోసం రూ.10.07కోట్లతో కేటాయించింది. చెరువు లోపల రాతి కట్టడం, రింగ్ బండను ఏర్పాటు చేసింది. చెరువులోపన ఉన్న మొత్తం పూడికతీతను బయటకు తీసింది. చెరువు చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేసింది. తూములో నుంచి నీళ్లు వెళ్లడానికి పెద్ద పైప్లైన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఎస్ఎన్డీపీ కింద పెద్ద కాలువను నిర్మించారు.
కాలుష్య రహితంగా కాప్రా చెరువు
కాప్రా, జూన్ 7: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాకే కాప్రాచెరువు సంరక్షణ, అభివృద్ధిపనుల్లో కదలికలు వచ్చాయి. ఊరచెరువుగా పిలువబడే కాప్రా చెరువు సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2019లో రూ.9.41 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు రూ. 5 కోట్లు వెచ్చించి 60శాతం పనులు పూర్తి చేశారు. చెరువులోకి కలుషిత జలాలు రాకుండా 2 కి.మీటర్ల మేర డ్రైనేజీ డైవర్షన్ పనులు పూర్తయ్యాయి. వాకింగ్ ట్రాక్ పనులు 80శాతం పూర్తికాగా, మిగతా 20శాతం కోర్టు కేసుల వల్ల నిలిచిపోయాయి.