సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మెట్రో పాలిటన్ పోలీసింగ్లో సవాళ్లను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన వృత్తి పరమైన జాగ్రత్తలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా అనైతిక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ అనంతరం అధికారుల ర్యాంకులు, కొత్త జోన్లు, డివిజన్లు, ఠాణాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సిబ్బంది బదిలీలు, కొత్తగా నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం వెయ్యి మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఆ పైస్థాయి అధికారులందరితో సీవీ ఆనంద్ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్లో జనాభా పెరుగుతోందని, వాహనాల సంఖ్య కూడా అదేవిధంగా పెరగడంతో మెగా పోలీసింగ్ ప్రణాళిక, ఆవశ్యకతల గూర్చి వివరించారు. పునర్వ్యవస్థీకరణ తరువాత ఆయా ప్రాంతాలు, సరిహద్దుల మ్యాపింగ్ పూర్తి చేయాలని ఐటీ విభాగానికి సీపీ ఆదేశించారు.
శాఖా పరంగా అంతర్గతంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ నైతిక ప్రమాణాలకు అత్యంత కట్టుబడి ఉండాలన్నారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ప్రతి జోన్, డివిజన్, పోలీస్స్టేషన్ల వారీగా సమగ్ర వివరాలతో వీడియో కన్ఫరెన్స్లో సీపీ చర్చించారు. సిబ్బంది కేటాయింపులపై సమీక్షించి, కొత్త అధికారులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, సంబంధిత అప్లికేషన్లపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాలు పరిష్కరించడంలో అధునాతన పరిశోధనాత్మక నైపుణ్యాలపై చర్చించి, రోజు రోజుకూ వస్తున్న సవాళ్లను ఎదుర్కొనే విధంగా ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. సీసీటీవీల ఏర్పాటు, పోలీసు బలగాలకు సంబంధించిన సంక్షేమ సమస్యలపై చర్చలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ, ఆన్లైన్లో పోలీసు సేవలు అందించడం, నేరస్తుల అరెస్టు, కేసుల దర్యాప్తు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, చార్జిషీట్.. తదితర అంశాలపై సీపీ సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్తో ప్రారంభించి, ఆయా విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు.