Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 19: అయ్యో పాపం.. అంటూ ఆదరించి అన్నం పెట్టారు.. ఖాళీగా తిరుగుతున్న కొడుకుకు డ్రైవింగ్ నేర్పించి బతుకుదెరువు చూపారు. కష్టాలు వస్తే మేమున్నామంటూ ఆదరించారు.. అయితే, పదేళ్లుగా తనను, తన కొడుకును ఆదరించిన కుటుంబానికి విషాదాన్ని మిగుల్చుతూ.. వారి కొడుకును కడతేర్చి మానవత్వానికే మచ్చ తెచ్చాడు ఆ కిరాతకుడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గాభవానీ నగర్లో ఈ నెల 13న పదేండ్ల బాలుడు కార్తీక్ హత్య కేసులో నిందితుడు రమావత్ మన్యం నాయక్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల పరిధిలోని మునావత్ తండాకు చెందిన మునావత్ రమేశ్ డ్రైవర్. జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్నాడు. అతడికి భార్య కవితతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. చిన్న కొడుకు మునావత్ కార్తీక్ అలియాస్ పండు (10) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కాగా, రమేశ్కు దూరపు బంధువైన రమావత్ మన్యం నాయక్ (53) గతంలో దుర్గాభవానీనగర్ బస్తీలో నివాసమున్నాడు. తొమ్మిదేండ్ల కిందట అతడి భార్య క్యాన్సర్తో మృతి చెందడంతో.. పదేళ్ల కొడుకు మల్లేశ్ నాయక్ను పక్కింట్లో ఉండే రమేశ్ నాయక్ చేర దీశాడు.
అతడి బాగోగులు చూసుకుని కడుపునిండా అన్నం పెట్టేవారు. మన్యం నాయక్ మద్యానికి బానిసై కొడుకును పట్టించుకోలేదు. మల్లేశ్ నాయక్కు ఆటో డ్రైవింగ్ నేర్పించడంతో.. కొన్ని నెలలుగా ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. చెడు అలవాట్లకు లోనైన మన్యం నాయక్ తరచూ రమేశ్ నాయక్తో గొడవ పడుతుండటంతో పాటు నోటికి వచ్చినట్లు మాట్లాడున్నాడు. దీంతో గత కొన్ని నెలలుగా అతడితో మాట్లాడటం మానేశారు. కాగా, ఈ నెల 13న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న కార్తీక్కు మాయమాటలు చెప్పి.. తనతో పాటు తీసుకువెళ్లిన మన్యం నాయక్ సమీపంలోని పార్కులో అతడితో అనైతిక పద్ధతి ప్రవర్తించాడు.
దీంతో గట్టిగా కేకలు పెట్టిన కార్తీక్ ముఖంపై గట్టిగా అదమడంతో పాటు బలంగా నాలాలోకి తోసేశాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడిని హత్య చేసిన అనంతరం పరారైన మన్యం నాయక్పై కార్తీక్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితుడు మన్యం నాయక్ టవల్, సీసీ ఫుటేజీతో పాటు ఇతర సాక్ష్యాలతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసును ఛేదించారు. కాగా, కష్టంలో ఉన్న మన్యం నాయక్ను ఆదుకోవడంతో పాటు కొడుకుకు దారిచూపిస్తే తమకు కడుపుకోత మిగిల్చాడంటూ.. మృతుడు కార్తీక్ తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.