బంజారాహిల్స్, జనవరి 18: బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్లో సంక్రాంతి రోజున చోటు చేసుకున్న దాడి ఘటనలో 11 మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బహుదూర్పుర సమీపంలోని కిషన్ బాగ్కు చెందిన షేక్ నవీద్(24)తో పాటు మరో ఐదు మంది స్నేహితులు సోమవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఆఫ్టర్ 9 పబ్కు వచ్చారు.
వారిలో అజర్ అనే యువకుడి పుట్టిన రోజు కావడంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో అతడి ఫొటోను డిస్ప్లే చేసి.. మ్యూజిక్ ప్లే చేయాలని నవీద్ తదితరులు పబ్ డీజే ఆపరేటర్లను కోరారు. అక్కడే ఉన్న షోయబ్ అనే యువకుడు ఇందుకు అడ్డుచెప్పడంతో గొడవ ప్రారంభమైంది. తాము పబ్ సిబ్బందితో మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు వచ్చావంటూ.. నవీద్ స్నేహితులు షోయబ్పై దాడికి దిగారు. షోయబ్ స్నేహితులు, నవీద్ స్నేహితుల మధ్య గొడవ పెద్దది కావడంతో పబ్లోని బౌన్సర్లు నవీద్, అజర్ తదితరులను బయటకు పంపించారు.
నవీద్ తమను మాత్రమే ఎందుకు బయటకు పంపించారంటూ బౌన్సర్లతో వాగ్వాదానికి దిగాడు. పబ్ లోపల ఉన్న షోయబ్ తదితరులు ఫోన్ చేయడంతో నందినగర్కు చెందిన పలువురు స్నేహితులు వచ్చి నవీద్, అజర్లపై దాడికి పాల్పడ్డారు. షోయబ్ స్నేహితుడైన ఇంతియాజ్ అజర్పై బీర్ బాటిల్తో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నవీద్ కూడా గాయాలపాలయ్యాడు. బౌన్సర్లు, డీజే సిబ్బంది తమపై దాడి చేయడంతో పాటు స్నేహితుడు అజర్ మీద కత్తితో దాడి జరిగిందంటూ..
షేక్ నవీద్ అదే రోజు రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బౌన్సర్ల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పబ్లో జరిగిన వాగ్వాదాన్ని గమనించి.. తాము వారిని బయటకు పంపించామని, తాము ఎవరిపై దాడి చేయలేదంటూ బౌన్సర్లు చెప్పారు. దీంతో పబ్ బయట ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానితులను గుర్తించారు. పబ్ లోపల గొడవ జరిగిన అనంతరం నందినగర్కు చెందిన సుమారు 15 మంది యువకులు అక్కడకు చేరుకుని దాడి చేశారని తేలింది.
పబ్లో జరిగిన గొడవ సమయంలో డీజే ఆపరేటర్ పక్కన నిలబడిన షోయబ్ బ్లాక్ డ్రెస్ ధరించడంతో అతడు కూడా బౌన్సర్ అయి ఉంటాడని భావించిన బాధితులు.. ఫిర్యాదులో తమ మీద బౌన్సర్లతో పాటు డీజే ఆపరేటర్లు దాడి చేశారని పేర్కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అజర్, నవీద్పై దాడికి పాల్పడిన వారిని మహ్మద్ షోయబ్(23), మహ్మద్ ఇంతియాజ్(20), కుర్వ రఘువర్ధన్(21), బానోత్ రాజ్కుమార్(25), మంజర సాయికుమార్(25), అజిత్ సలుంకే(23), పీవీ రవితేజ (23), మహ్మద్ సల్మాన్ ఖాన్ (23), జకాతి సాయి ప్రకాశ్ (27), మున్నూరు సాయి (23), సబావత్ సాయికిరణ్ (21)లుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించారు.