హైదరాబాద్ : పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ( DGP Ravi Gupta) అన్నారు. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శుక్రవారం 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ ఎన్నో కేసుల దర్యాప్తులో జాగిలాలు(Dogs) నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయని తెలిపారు.
ఐఐటీఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిందని, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల జాగీలాలకు ఐఐటీఏ(IITA Training) శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్(Duty Meet) లో పథకాలు సాధించారని ప్రశంసించారు.
ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పేరు తెచ్చుకున్న తెలంగాణ పోలీస్ శాఖ సాధించిన విజయాలలో పోలీస్ జాగిలాలు ప్రశంసాపూర్వక పాత్రను నిర్వహించాయని వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్ను డీజీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు.