సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ‘నాకు పెండ్లయ్యింది… ప్రేమ అంటూ వెంట పడకుండా .. చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని సాధించు’ అని సూచించిన గురువుపై కక్ష్య పెంచుకున్న ఓ విద్యార్థిని.. అతడి కుటుంబసభ్యుల అశ్లీల చిత్రాలను రూపొందించి.. సోషల్మీడియాలో సర్యూలేట్ చేసింది. బిచ్చగాడి పేరుపై సిమ్కార్డు కొనుగోలు చేసి.. ఎవరికీ దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంది. చివరికి కటకటాలపాలైంది. నగర జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. అనంతపూర్కు చెందిన యవతి గ్రూప్-1 కోచింగ్ కోసం హైదరాబాద్కు వచ్చి ఓ ప్రైవేట్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నది.
అందులో ఒక ఫ్యాకల్టీకి ప్రేమిస్తున్నానంటూ.. తన మనసులోని మాట చెప్పింది. తనకు పెండ్లయ్యిందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అతడు ఆమె ప్రేమను తిరస్కరించాడు. చదువుకోమంటూ.. మందలించాడు. లక్ష్యాన్ని పక్కన పెట్టి.. ఏం చేద్దామనుకుంటున్నావంటూ.. మంచి మాటలు చెప్పాడు. ఇది అవమానకరంగా భావించిన సదరు యువతి.. అతడి పరువు తీయాలని పన్నాగం పన్నింది. అనంతపూర్లో యాచకుడికి రూ. 500 ఇచ్చి అతడి పేరు మీద సిమ్కార్డు కొనుగోలు చేసింది.
ఆ సిమ్ను ఉపయోగించేందుకు ఒక సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసింది. ఫ్యాకల్టీ కుటుంబ సభ్యుల ప్రొఫైల్ను ఇన్స్టాగ్రామ్ నుంచి సేకరించింది. ఆ చిత్రాలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి.. సోషల్మీడియా, కోచింగ్ సెంటర్ విద్యార్థులకు షేర్ చేసింది. విషయం తెలుసుకున్న ఫ్యాకల్టీ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఏసీపీ చాంద్పాషా నేతృత్వంలో ఇన్స్పెక్టర్ సైదులు బృందం దర్యాప్తు జరిపింది. నిందితురాలు గ్రూప్-1 కోచింగ్ తీసుకుంటున్న అనంతపూర్కు చెందిన యువతిగా గుర్తించి అరెస్ట్ చేశారు.