సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి జరుగనుండటంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది గుమికూడడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించ రాదని సీపీ సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, ప్రశాంతతకు భంగం కల్గించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ పరిసరాల్లో వాకింగ్ చేసే వారు ఉదయం 7 గంటల లోపు వాకింగ్ ముగించుకోవాలని అసెంబ్లీ అధికారులు తెలిపారు. 7 గంటల తరువాత పోలీసు బందోబస్తు ఆంక్షలు ఉండడంతో, సామాన్య ప్రజలను అటు వైపు అనుమతించరన్నారు.