సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల పరిశోధన, మహిళా భద్రత తదితర అంశాల్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)సేవలు సత్ఫలితాలిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. బుధవారం కమిషనరేట్లో ఎస్సీఎస్సీ ప్రతినిధులు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ కారిడార్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఐటీ కంపెనీలు తమ సెక్యూరిటీ మార్షల్స్లో కొంతమందిని ట్రాఫిక్ నియంత్రణకే కేటాయించాలన్నారు.
సాధారణంగా ప్రతి ఐటీ పార్క్లో 10వేల నుంచి లక్ష మంది వరకు ఉద్యోగులు ఉన్నారని, అదే స్థాయిలో వాహనాలు సైతం ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నట్లు చెప్పారు. ఉద్యోగుల్లో ట్రాఫిక్, రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచేందుకు టౌన్ హాల్ మీటింగ్లు నిర్వహించే తేదీలను సంబంధిత సంస్థలకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ జోయల్ డెవిస్, ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ రమేశ్ కాజా, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.