మెహిదీపట్నం : చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 50 తులాల బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ జోయల్ డేవిస్, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, హుమాయూన్నగర్ ఇన్స్పెక్టర్ కె.నారాయణ రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ రావులతో కలిసి వివరాలను వెల్లడించారు.
ఆసిఫ్నగర్ జేబాబాగ్లో నివసించే సయ్యద్ ఇర్ఫాన్ (20), హుమాయూన్నగర్లో నివసించే సయ్యద్ అలీ జాఫా (19) మరో ముగ్గురు మైనర్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు జల్సాల కోసం దొంగతనాలను చేయడానికి పథకం వేశారు. దీనికి ఇండ్లను ఎంచుకుని రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలను చేసేవారు.
హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం గురించి పోలీసులు విచారిస్తుండగా వీరి కదలికలపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి వీరి ముఠా మాసాబ్ట్యాంక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పశ్చిమమండలం టాస్క్ ఫోర్స్ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి, ఎస్ఐ ముజఫర్ల బృందం హ్యమాయూన్నగర్ పోలీసులతో కలిసి పట్టుకుంది.
వీరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారించగా హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ ఒకటి,మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి 50 తులాల బంగారు ఆభరణాలను, 10 వేల రూపాయల నగదును, ఓ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు సభ్యుల ముఠాలోని ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఇద్దరు బాలురును జువైనల్ హోంకు పంపారు. మరో బాలుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.