సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విలేకరుల సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ కల్మేశ్వర్, సైబర్ క్రైమ్స్ డీసీపీ రితిరాజ్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాకు చెందిన మోహిన్ పాషా, కరణ్ అరోరా, సంజీవ్కుమార్, గోకుల్సింగ్ కొరంగ, దినేశ్సింగ్, న్యూఢిల్లీకి చెందిన కరణ్ మల్హోత్ర, ఢిల్లీకి చెందిన సోను లోకేశ్, మోహిత్కుమార్లు ఒక ముఠాగా ఏర్పడి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు పాల్పడుతున్నారు.
వినియోగదారులకు డబ్బు ఆశ చూపిస్తూ అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవిధంగా వారిని మోసగించి వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును కాజేస్తారు. ఇలా దోచుకున్న డబ్బును ఇతరుల పేరుపై ఉన్న ఖాతాల ద్వారా విత్డ్రా చేస్తారు. ఇందుకు కొంత మందికి కమీషన్ ఇవ్వగా మరికొంత మందికి తెలియకుండానే వారి వివరాలతో ఖాతాలు, సిమ్కార్డులు పొంది డబ్బును విత్డ్రా చేస్తారు.
ఇలా పట్టుపడ్డారు …
గత సంవత్సరం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతుకు భూపరిహారంగా డబ్బులు వచ్చాయి. డిసెంబర్ 19న సదరు రైతు కుమారుడు ఆన్లైన్ గేమ్ ఆడుతూ తన బ్యాంక్ ఖాతాలోని రూ.44.26 లక్షలు కోల్పోయాడు. అంతే కాకుండా తన తల్లి ఖాతాలో నుంచి మరింత డబ్బును కూడా కోల్పోయాడు. ఇలా సదరు బాధితుడు ఒకే రోజులో మొత్తం రూ. 98,47,334 కోల్పోయాడు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్క్రైం విభాగంలో కేసు నమోదు చేసి ఎన్సీఆర్పి(నేషనల్ సైబర్క్రైం పోర్టల్)కి సమాచారం అందించారు. పోలీసులు సాంకేతిక సహకారంతో ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించారు.
ఆన్లైన్ గేమ్ల ద్వారా డబ్బులు డ్రా చేసిన 32 వేర్వేరు బ్యాంక్లకు చెందిన ఖాతాలను గుర్తించి వాటిల్లో ఉన్న రూ. 41కోట్లు ఫ్రీజ్ చేశారు. అనంతరం 8 మంది నిందితులను ఢిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకుని, నగరానికి తరలించారు. నిందితుల వద్ద నుంచి 193 సెల్ఫోన్స్, 21ల్యాప్టాప్స్, 21 పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్, 416 చెక్ బుక్స్, 233 డెబిట్ కార్డ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును చేధించిన సైబర్క్రైమ్ ఏసీపీ శ్రీధర్, ఇన్స్స్పెక్టర్ కే.శ్రీనివాస్, ఎస్ఐ బి.సందీప్ తదితరులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.
1930కి ఫిర్యాదు చేయండి
– క్రైం డీసీపీ కల్మేశ్వర్
ఆన్లైన్ ద్వారా మోసపోయి, బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బు కోల్పోతే బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు, ఎన్సీఆర్పీ(నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ )లో ఫిర్యాదు చేయాలి. దీనివల్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించి లావాదేవీలతో పాటు డబ్బును డ్రా చేసిన బ్యాంక్ ఖాతాలను దేశంలో ఎక్కడున్నా ఫ్రీజ్ చేస్తాం. ఫలితంగా బాధితుల సొమ్ము రికవరీ అయ్యే అవకాశముంటుంది.