ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు
81 కిలోల గంజాయి స్వాధీనం
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 : పరుపుల్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 81 కిలోల గంజాయి, కారు, ట్రాలీఆటో, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మాదాపూర్ డీసీపీ శిల్పావల్లి కేసు వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాంతయ్యపాలెంకు చెందిన పాస్తంరాజు(37) ఇనుప మంచాల వ్యాపారి. వ్యాపారం నిమిత్తం ఏపీ, ఒడిషా రాష్ర్టాల సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాడు.
అక్కడ టీస్టాల్లో పరిచయమైన ఓ వ్యక్తి ఇనుపమంచాల్లో గంజాయి తరలించాలని, పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. దీంతో రాజు తన గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు ఎడ్ల వెంకట్రెడ్డి(48), గడ్డ ప్రవీణ్రెడ్డి(37)లను గంజాయి అక్రమ రవాణాలో తన ఆటోతోపాటు ముందు ఎస్కార్ట్గా కారులో రావాలని పథకం రచించారు. ట్రాలీఆటో (టీఎస్04యూబీ2814)లో ఇనుపమంచాలకు అమర్చిన పరుపుల్లో గంజాయిని నగరానికి తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు మంగళవారం నల్లగండ్ల చౌరస్తాలో పాస్తం రాజు, ప్రవీణ్రెడ్డి, వెంకట్రెడ్డిలను అరెస్టు చేసి వారినుంచి 81 కిలోల గంజాయి, కారు, ఆటోట్రాలీని స్వాధీనం చేసుకున్నారు.
340 గ్రాముల గంజాయి పొట్లాల పట్టివేత
మన్సూరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న కేసులో నలుగురు యువకులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరిని జువైనల్ను హోంకు తరలించారు. ఎల్బీనగర్ శివగంగాకాలనీకి చెందిన పినిశెట్టి గౌతంకృష్ణ (21) గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారమందింది. నిఘాపెట్టిన పోలీసులు ఎల్బీనగర్ సమీపంలోని బాలాజీనగర్లో గంజాయి విక్రయించేందుకు యత్నిస్తుండగా గౌతమ్కృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా, గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న మన్సూరాబాద్ జడ్జెస్కాలనీకి చెందిన వల్లెపు లోహిత్ (20), బీరెడ్డి సాయినితిన్ (19), ఉదయ్కిరణ్ (21)తోపాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 340 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణా కేసులో నదీమ్కు 20 ఏండ్లు జైలు
గంజాయి రవాణా, అంతర్రాష్ట్ర ఎగుమతి కేసులో నిందితుడు నదీమ్ (25)ను నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి దోషిగా నిర్ధారించారు. అతడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో మూడేండ్లు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు.
ఆపరేషన్ గంజాయి బెడర్స్కు ప్రశంస
స్మగ్లర్లు సరికొత్తగా ఆలోచించి గంజాయి తరలింపునకు గంజాయి బెడ్స్ తయారు చేశారు. ఆ గంజాయి పరుపులను ఓపెన్ టాప్ఆటోలో తరలించారు. మాదాపూర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ మారుతిశివ బృందం తమదైన శైలిలో కీలక సమాచారం రాబట్టి ఈ సరికొత్త గంజాయి స్మగ్లింగ్ రూట్ను బట్టబయలు చేసింది. ఈ గంజాయి బెడ్స్ స్కెచ్ వేసిన ప్రధాన సూత్రధారి పాస్తం రాజు, అతడి అనుచరులు యెడ్ల వెంకట్రెడ్డి, గంజి ప్రవీణ్రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ గంజాయి బెడ్స్ను పట్టుకొని మత్తును నగరానికి చేరకుండా చేసిన మాదాపూర్ ఎస్వోటీ బృందం పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసించారు.